రూపాన్ని
కోల్పోయి
ఖాళీగా
మిగిలిన
ప్రతిసారీ
నీ జ్నాపకాలు
కమ్ముకొని
ఒక్కసారిగా
భారమైపోతాను…
ఇది మా బాడంగి మండలం, పిన్నవలస అల్లు శ్రీను దీవెన..
వీడి రాకతో సంక్రాంతి వచ్చినట్లైంది…
గంగిరెద్దుల వారం బావ్ మేం, మాలోను సదువుకున్నోళ్ళున్నారు, టీసర్లయ్యారు, మిలటరీలోనున్నారు..
మరి నువ్వేం సదువుకోలేదంటే అదోలా సూసి సదువుకోలేదు అని సన్నాయి వాయించుకుంటూ తన కాశీ ఆవును తోలుకుపోయాడు.
కాశీ ఆవు అంటే వీపు మీద, మోర మీద మరో కాలుండేవి. వీటిని సింహాచలం కొండ దగ్గర వదిలేస్తారు. లేకపోతే వీళ్ళకు దానం చేస్తారంట.
(చిట్టంటే మా ప్రాంతంలో పశువులు తినే తౌడన్నమాట)
కళింగాంధ్రకే పరిమితమయిన జగన్నాధ రధయాత్రను ఈ దినం జరుపుకుంటున్నారు మా ప్రాంత ప్రజానీకం. ఈ పండగను ఇక్కడ ఆవిటి అంటారు. ఈ రోజు జగన్నాధునితో పాటు బలరాముడిని తోడుగా సుభద్ర తన రథంపై ఊరేగింపుగా చేరుకుంటుంది తన కన్నవారింటికి. ఆ ప్రదేశాన్ని గుండిచ మందిరం అంటారు. ఈ రోజునుండి తొమ్మిది దినాలు శ్రీక్రిష్ణుడు దశావతారాలతో భక్తులకు కనువిందు చేసిన అనంతరం మారావిటి అదే మారు రథయాత్ర రోజు తిరిగి రథంపై ఊరేగింపుగా జగన్నాథ దేవాలయానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ఇది ఒక ఐదారేళ్ళ క్రితం వరకు అత్యంత వైభవంగా జరిగేది. జనం ఊకపోస్తే రాలనంతగా చేరి రథం లాగుతూ వచ్చి గుండిచ మందిరం చేరేముందు రథంపైనే పూజలు చేసే వారు. ఈ సమయంలో చాలా సందడితో పండగ వాతావరణం నిండుగా వుండేది. అరటిపళ్ళను పైకి విసురుతూ మొక్కుకునే వారు కొందరు. ఇందులో ఆకతాయి కుఱవాళ్ళు అరటిపళ్ళ మధ్యలో బరువైన నాణాన్ని వుంచి గురిచూసి కొట్టేవారు. అది తగిలిన వాళ్ళు తిట్ల పురాణం లంకించుకునేవారు. అదో సరదాగా సందడిగా అంతా ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు రథం చుట్టూ జనం చేరేందుకే గంటలు పడుతోంది. రథం సైజు కూడా కుంచించుకు పోయింది. అప్పుడు రెండు ఏనుగులంత రథం వుండేది. ఇప్పుడు గున్న ఏనుగంత అయిపోయింది. అలాగే యాత్ర జరిగే రోజుల్లో వర్షాలతో బురద బురదగా వుండేది. ఈ రోజు వాన తప్పక కురుస్తుందన్న నమ్మకంతో జనం వుండేవారు. కానీ ఈ రోజు ఎక్కడో ఒక చినుకు తప్ప వానలేక మరింత బోసిపోయింది మా సుభద్రక్క. ఆవిటి రోజు ‘ఆరిది’ వండిపెట్టే వాళ్ళే లేకపోయారు. ఆరిది అంటే బియ్యం పిండితో కొబ్బరిముక్కలు, బెల్లం వేసి చేసే ఒకరకమైన పరమాణ్ణం. దాని కమ్మదనం ఈ పోస్టు రాస్తుంటే ముక్కపుటాలకు చిన్నప్పుడు మా బాప్ప (మేనత్త) వండిపెట్టినది ఇప్పటికీ ఎరుకై మనసు బాధగా మూలుగుతోంది.
ఆంధ్రరాష్ట్రంలో మరెక్కడా ఈ పండగ వుండదు. ఈ మూడు జిల్లాలకే పరిమితమయిన పండగ. దీనికి కారణం ఈ ప్రాంతం ఒరిస్సాకు దగ్గరగా వుండటం, అలాగే ఒడియా బ్రాహ్మణులెక్కువగా వున్న దగ్గర వారి సాంప్రదాయాను సారం ఈ యాత్ర జరుగుతోంది. మా ప్రాంతంలో పార్వతీపురం, కురుపాం, చినమేరంగి, సంగంవలస, సాలూరు జమీందారులు వున్న దగ్గర జగన్నాదస్వామి దేవాలయాలు వారు కట్టించినవి వుండటం, వాటికి వారు సమకూర్చిన ఈనాంలు ఇప్పటికీ ఆయా ఆలయ పూజారుల కింద వుండటం చేత ఆలయాలు నిర్వహింపబడుతు కొంతమేర ఈ యాత్ర కొనసాగుతున్నాయి. కొత్త కొత్తగా పుట్టుకొచ్చిన షిరిడీ సాయిబాబా గుడుల మోజులో పాత దేవుళ్ళను పట్టించుకున్న భక్తులు కరవై ఇవి నామ మాత్రంగా సాగుతున్నాయి. ఆలయాలు శిధిలావస్తకు చేరుకుంటున్నాయి. అయినా కళింగాంధ్ర సాంప్రదాయ మేలుకలయికగా ఈ యాత్ర జరుపుకోవడం ముదావహం.