రాష్ట్రంలో గత కొన్నేళ్ళూగా వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అతి దయనీయంగా మారుతున్నది. హాస్టల్ విద్యార్థులకు రోజుకు 17/- లు మాత్రమే భోజనానికి ఇస్తున్నారు. దీనిలో సంక్షేమాధికారుల వాటాలు పోను వారికి కనిష్టంగా పది రూపాయలతోనే పెడుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి కనిష్ట ప్రమాణాలకు దిగజారుతూ ఎంతో మంది విద్యార్థులు మరణాలకు గురవుతున్నారు ప్రతి యేడూ.
గిరిజన ఆశ్రమ విద్యార్థులది మరీ దారుణమైన పరిస్థితి. వీరికి ఎక్కువగా మలేరియా వ్యాధి సోకి అనారోగ్యానికి గురైతే వీరిని ఆసుపత్రులలో చేర్చక తల్లిదండ్రులతో ఇంటికి పంపించి చేతులు దులుపుకుంటారు. దీంతో వీరు కనీస రహదారి సదుపాయం లేని గ్రామాలకు వలసలకు చేరుకొని అక్కడ చావుతో పోరాడి ఓడిపోతున్నారు. ఇలా ప్రతి ఏటా వందలాది విద్యార్థులు మరణిస్తున్నారు. దీనిపై సర్వేలు చేసి ఏవో ప్రకటనలు ఇచ్చి ఆచరణ శూన్యమైన పథకాలతో చేతులు విదిలిస్తున్నారు. వీరికి ప్రాధమికి వైద్యం అందుబాటులో వుండదు. మలేరియా డ్రగ్స్ వాడితే పోషక విలువలువున్న అహారం అవసరం. కానీ అది వీళ్ళకు అందుబాటులో వుండ ఈ మందుల ప్రబావంతో జాండిస్ ఇతర సైడ్ ఎఫెక్ట్సుతో చావుకు లోనవుతున్నారు. ఇటీవల మా ITDA పరిధిలోని గ్రామాల పర్యటన సందర్భంగ నేను గమనించింది ఇది.
ఇంకో ముఖ్య విషయం రోజుకు ఖైదీకి భోజన ఖర్చు 50/-లు, ప్రభుత్వాసుపత్రులలో రోగికి 40/-లు (ఇందులో కమీషన్లు పోనూ రోగికి 25/-లు కూడా అందడంలేదన్నది వేరే విషయం) కానీ విద్యార్థికి రోజుకు 17/-లు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇందులో సంక్షేమాధికారుల వాటా అధికం. ఇలా సరైన పర్యవేక్షణ లేక హాస్టళ్ళలో అతి దారుణ పరిస్థితులలో మగ్గుతూ SC, ST, BC విద్యార్థులు మరో గత్యంతరం లేక చదువులు కొనసాగిస్తున్నారు. కోట్లాది రూపాయలు విద్యకు ఖర్చు చేస్తున్నామని ప్రకటనలకే పరిమితమవుతున్నది ప్రభుత్వం. కింది స్థాయికి వచ్చేసరికి రూపాయికి తక్కువవుతున్న వైనం అందరికీ ఎరుకలో వున్నదే. సంక్షేమం నుండి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ పేదలకు విద్యను అందని ద్రాక్షను చేస్తున్నది. పేద విద్యార్థులు హాస్టళ్ళలో కూడా తమ దారిద్ర్యాన్నే అనుభవిస్తూ అవమానాలు పడుతూ విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో హైస్కూలు విద్యకు వచ్చేవారు సగానికి పైగా తరిగిపోతున్నారు. ఆ తరువాత కొనసాగినా అతి తక్కువ మందే చివరి వరకు ఉంటున్నారు. కూలి కొడుకు మరల కూలిగానే మిగిలిపోతున్నాడు…