పెళ్ళి చేసుకోకుండా సహజీవనం, పెళ్ళికి ముందే శృంగారం అనేవి తప్పుకాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
2005 లో ఖుష్బూ చేసిన వ్యాఖ్యల వలన ఆమెపై తమిళనాడులో 22 కేసులు నమోదయ్యాయి. వాటిపై ఆమె సుప్రీం కోర్టునాశ్రయించగా నిన్నటి విచారణలో న్యాయమూర్తులు వీటిపై పై విధంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, వాటి వలన ఎంతమంది ఆడపిల్లలు ప్రభావితులయ్యారు, ఎంతమంది ఆడపిల్లలు లేచిపోయారని ప్రశ్నించింది. మనం ఆరాధిస్తున్న రాధాక్రిష్ణులది సహజీవనమే కదా అని గుర్తుచేసారు. అనైతికమన్నదానిని నేరమయముద్ర వేయవద్దని సుప్రీం సూచించింది.
యిది వ్యక్తిగత నైతికతకు సంబంధించిన అంశం. ఇది ఎవరికి వారు నిర్ణయించుకొని అనుసరించాల్సిన విషయం. పెళ్ళికి ముందు అనుభవంపై సర్వేలలో మనదేశంలో ఆ మధ్య ఎక్కువశాతమే ఒప్పుకుంటున్న గుర్తు. మారిన కాల మాన పరిస్థితులలో స్త్రీ పురుష సంబంధాలలో వస్తున్న మార్పులు ఇరువురి మద్య ఈ విషయం ఆమోదం పొందుతున్నట్లుగానే కనిపిస్తోంది.
ఇక్కడ మరో విషయం కూడా దాగివుంది. పురుషులు చేస్తే తప్పుకాదు, అది స్త్రీ వైపునుండే పరిశుద్ధతను కోరుకోవడం. మారిన సామాజిక వాతావరణంలో స్త్రీ నాలుగ్గోడలమద్య బందీగా లేనప్పుడు తానూ వీటి ప్రభావానికి గురౌతోంది. అందుకే చర్చనీయాంశమయ్యింది. నాడు మానసిక వ్యభిచారమె నేరమన్న కాలం నుంచి పబ్ లు, పార్టీలు, డేటింగ్ లు పెరిగిన కాలంలో ఇది సామాజిక ఆమోదం పొందినట్లుగానే భావించొచ్చా? ఔననే అనుకుంటున్నా.