ఈ రోజు కాకరాపల్లి ధర్మల్ ప్రోజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పల్లె ప్రజలపై పోలీసు కాల్పులలో ఇద్దరు మరణించారు. బీల ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు వలన మొత్తం ఆ ప్రాంతమంతా జలమయమై ప్రజలు కూడూ గూడుకు దూరమైపోతున్నందుకు నిరసనగా చేపట్టిన ఉద్యమాన్ని అణచివేయడానికి శతృ దేశంపై దండయాత్రకు వెళ్ళినట్లుగా వందలాదిమంది పోలీసులను మోహరించి భయభ్రాంతులను చేస్తున్నా ప్రజలకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడంతో గత్యంతరం లేక తిరగబడుతున్న వారిపై సాయుధ మూకలు కాల్పులు జరపడం, ఈ కాల్పులలో మరణించిన వారిని ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన నాగేశ్వర రావు, బీరపువానిపేట గ్రామానికి చెందిన ఎర్రయ్యలుగా గుర్తించారు. అనేక మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసు ఫైరింగ్ తో వారి గుడిసెలన్నీ తగలబడుతున్నాయి.
ఇంతగా ప్రజలు తిరగబడుతున్నా ప్రైవేటు కంపెనీలకు అమ్ముడు పోయిన పాలక వర్గం వారి విన్నపాలను వినేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. గత ఆరు నెలలుగా వడ్డితాండ్ర గ్రామస్తులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా కనీసం స్పందించలేదు. ఆ ప్లాంటు చుట్టూ నిర్మించిన గట్టు వలన వందలాది ఎకరాల వరి పంట మునిగిపోయింది. ఆ ఫోటోలతో కూడిన పోస్ట్ గతంలో ప్రత్యక్ష్జంగా చూసి ఈ బ్లాగులో వుంచాను. ఎంతసేపూ వారికి మద్ధతుగా ఎవరెవరు వస్తున్నారు, ప్రతిదినం ఎవరు కూచుంటున్నారు అన్న విషయ సేకరణ పట్ల వున్న ఆసక్తి తప్ప వారి గోడును వినే నాధుడు లేకపోవడం, మునిగిపోతున్న తమ బతుకులను కాపాడుకోవడానికి తిరగబడ్డం తప్ప ప్రత్యామ్నాయం లేకపోయిన ఆ మత్స్యకార, సన్నకారు రైతు కుటుంబాల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం. ఇలా ప్రజల ప్రాణాలను హరించి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?, ఇంత ఘోరమైన నీచమైన పనులు చేస్తూ ప్రజల పట్ల బాధ్యతలేని పాలకులు తమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి అధికార ప్రతిపక్ష నాయకులు ఒకటై పోయారన్న చేదు నిజం ఇక్కడ సత్యదూరం కాదు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రోజెక్టు ప్రతిపక్ష భారీ విగ్రహానిదేనన్న సత్యం అందరికీ తెలుసు. వీడు మైకు దొరికితే గొంతు చించుకొని అవినీతి గురించి మాటాడుతాడు ముద్ద ముద్దగా. ఇక్కడి జనం నోట్లో మట్టి గొట్టడానికి తయారైన వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఉత్తరాంధ్ర బొగ్గుకాక తప్పదు. దీనిని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు తప్పక ఖండించి ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని కోరుకుంటున్నాం..














