ఆయనను
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
మానవహక్కుల కొరకు ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది’
అంది..
నక్సల్బరీ తరం నాయకుడు
సత్యనారాయణసింగ్
‘ప్రాసిక్యూటర్లకు ప్రాసిక్యూటర్’ అన్నాడు..
ఒకప్పటి మానవహక్కుల నేత, జర్నలిస్టు,
ఇప్పుడు సంఘపరివార్ సిద్ధాంతకర్త
అరుణ్ శౌరి
‘లోకాధివక్త’ అన్నాడు..
ఆయన
నాలుగు దశాబ్ధాలుగా
న్యాయవాద వృత్తిలో
పోరాడే ప్రజల హక్కుల
పరిరక్షణ కోసం
అహర్నిశలు శ్రమిస్తున్న
అసాధారణ మేధావి
ఆంధ్రదేశంలోనే కాదు
దేశం మొత్తానికే
పౌర, ప్రజాతంత్ర హక్కుల స్ఫూర్తికి
పర్యాయ పదంగా ఎదిగినవాడు
మనిషిగా సామాన్యుడు
వాదనా పటిమలో అసామాన్యుడు
తోటి మనిషి హక్కులను కాపాడడంలో అనితర సాధ్యుడు
పై వాక్యాలన్నీ చదవగానే ఈ తెలుగునేలపై వున్న ఆ అసామాన్యుడు ఎవరో ఇప్పటికే అర్థమై వుంటుంది. ఈ వాక్యాలు 24 గంటలు అన్న ఆయన ఆత్మకథాత్మక సామాజిక చిత్రం అనే పుస్తకం వెనక అట్టమీదున్నవి. ఆయనే మనందరి హక్కుల న్యాయవాది కె.జీ.కన్నాభిరాన్. ఆయన ఈ సాయంత్రం 5.00 గం.ల ప్రాంతంలో అమరులయ్యారన్న వార్త సామాన్యులకు, నిరంతరం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న వారికి అశనిపాతం. ఆయన లాంటి మరో న్యాయవాది పేదలకు, తాడిత, పీడిత వర్గాలకు ఇప్పట్లో మరల లభ్యంకావడం దుర్లభం. ఈ రోజుల్లో మనుషులలో పెరిగిపోతున్న నిర్లిప్తత, నిర్లక్ష్యం, వ్యక్తివాద ధోరణి, స్వార్థం మానవత్వాన్ని చంపేస్తున్న వేళ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం కాలంలో ఇది అశనిపాతం..
జోహార్ కన్నాభిరాన్ జోహార్ జోహార్..




