రాజు చచ్చిన ఆర్నెళ్ళకు రాణి ఏడ్చిందన్న సామెతలా వుంది AICC తీసుకున్న నిర్ణయం. జగన్ ను అడ్డుకునేందుకు వేసిన అస్త్రం తప్ప ఈ లక్షరూపాయల పరిహారం ఎందుకు ప్రకటించారో ఇప్పుడు వివరంగా చెపితే బాగుంటుంది. ఇది పార్టీ నిధి నుండి విడుదల చేస్తున్నారా లేక ప్రజల పన్నుల సొమ్మా ముందుగా తేట తెల్లం చేయాలి. ఇది పార్టీ సొమ్మయిన ప్రజలను పిండి వసూలు చేసినదే కదా? మొన్నటి వరకు ఆ చావులన్నీ ఉత్తివే అని అన్న వృద్ధ జంబూకాలు ఇప్పుడు మాట మార్చడం ప్రజల జ్నాపక శక్తిపై వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
అసలు ఓ నాయకుడు చనిపోతే అంతమంది సామాన్య జనం చనిపోవడం ఈ విశ్వంలోనే ఎక్కడా లేదు. ఇలాంటి జీర్ణించుకోలేని సంఘటనలు జరిగినప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మనకు తమిళ తంబీల నుంచి వచ్చిన ఓ దురాచారం. తరువాత్తరువాత ఇది ఓ ఆయుధంగా మారింది. వేలకోట్ల రూపాయలు సంపాదించుకున్న వారెవరికీ ఆగిపోని గుండె రెండు వందల పించను అందుకున్న ముసలి వారిది కావడం విషాదం. ప్రతి ఇంట్లో ఆ రెండురోజులు ఓ విషాదకర వాతావరణాన్ని నింపి ఇలాంటి సంఘటనలకు ప్రేరేపించిన చానళ్ళను ఏమనాలో తెలీడంలేదు. ఆ తరువాత తమ తమ రాజకీయ ఊసరవెళ్ళితనాన్ని బయటపెట్టుకొని ఎవడి గోడు వాడు వినిపించడం మొదలు పెట్టారు.
వారసత్వంగా అధికారం రాకపోతుందా అని ఆశించి భంగపడ్డ యువనేత తన ఆఖరి అస్త్రంగా ఓదార్పు యాత్ర చేపట్టడంతో పెరుగుతున్న ఆయన ఇమేజిని దెబ్బకొట్టే చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ నాయకత్వం ఈ పేకేజీ ప్రకటించింది. తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మరణించిన వారిపట్ల ఇలాంటి సానుభూతి ఏనాడూ చూపిన దాఖలాలు లేవు. కొన్ని వేలమంది రైతులు మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర విదర్భ ప్రాంతం, యూ.పి.లో, పశ్చిమ బెంగాల్ మొ.న రాష్ట్రాలలో ఆత్మ హత్యలు చేసుకుంటే వారిపట్ల కూడా పార్టీపరంగా ఇటువంటి పేకేజీ ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగా వారిని పూర్తిగా ఆదుకున్నదీ లేదు. అలాగే తెలంగాణా కోసం ఆత్మాహుతి చేసుకున్న యువకుల పట్ల కనీసం ఓ సానుభూతి వాక్య తీర్మాణం కూడా చేయలేదు.
మొన్నటికి మొన్న చంద్రబాబు బాబ్లీ అరెస్టు జరిగినప్పుడు రోజూ ఓ పదిమంది చనిపోయిన లిస్టు ఆంధ్రజ్యోతిలో వచ్చేది. కానీ వాళ్ళెవరూ దీని గురించి స్పందించిన దాఖలాలు లేవు. ఇవన్నీ నిజమైనవి అయితే వదిలేస్తారా? ఎందుకో కావాలని ప్రజల మనోభావాలను, మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలను ఈ మధ్య మీడియా చేస్తోంది.
ఇటువంటి పేకేజీ పలాస్త్రీలు రాజకీయాలను మరింత భ్రష్టు పట్టిస్తాయన్నది సత్యం.
