ఈ రోజు నారాయణగూడలో జరిగిన నిర్మాణంలో వున్న భవనం కూలిన దుర్ఘటనలో 11 మంది కూలీలు మరణించారు. ఇందులో ఒకరు 11 నెలల పసికందు. ఇద్దరు మహిళలు. వీరంతా మెదక్, పాలమూరు జిల్లాల వాసులుగా చెప్తున్నారు.
ఈ భవనం పక్కనున్న పాఠశాల భవనంపై కూలడంతో అది కూడా బీటలు వారింది. ఏ అదృష్టం కాపాడిందో అందులోని చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు.
యిలా కడుతున్నవో, కట్టినవో కూలిపోవడం ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. వీటన్నింటికీ కారణం కాంట్రాక్టర్లతో కుమ్మక్కయిన అధికారుల వలననే జరుగుతున్నాయి. ఒక స్థలంలో కొత్తగా ఏదైనా కట్టడం నిర్మించాలంటే పొందాల్సిన అనుమతులు చాలా వున్నాయి. వీటిని సవ్యంగా పర్యవేక్షించక పోవడంవలన, కాంట్రాక్టర్లు ఇచ్చిన లంచాల కక్కుర్తితో, రాజకీయ వత్తిడులతోనో అధికారులు ఉదారంగా అనుమతులివ్వడంవలన యిలా జరుగుతున్నాయన్న వాస్తవం అందరూ ఎరిగినదే!
ఒక మధ్యతరగతి వ్యక్తి స్వంత యిల్లు కట్టుకుందామంటే వాడి ముక్కుపిండి, కళ్ళలోంచి నెత్తురు కారి, కాళ్ళ చెప్పులరిగేలా తిప్పి ఈ జన్మలో యిల్లు వద్దనుకునేట్లు చేసే అధికారగణం, అదే ఒక కాంట్రాక్టరో, కార్పొరేటరో అయితే క్షణాలలో పనిచేసి పెడతారు. యిది మన వ్యవస్థలో పాతుకుపోయిన నైజం. ఎవరికి వారే తప్పుకుపోయే వాళ్ళం కాబట్టి యిలాంటివి సర్వసాధారణమయిపోయాయి.
యిలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావిడిగా ex-gratia ప్రకటించి, నలుగురిని సస్పెండ్ చేసే మన నాయకమ్మణ్యులు, వాటాలు కుదిరినాక, కులమో, మతమో పనిచేసి మరల వారిని యదావిధిగా విధుల్లోకి తీసుకుంటారు. సస్పెండ్ అయిన కాలానికి పనిచేయకుండా జీతమూ వస్తుంది. హయిగా మరిన్ని స్వంత వ్యాపారాలు చేసుకునే అవకాశమూ వుంటుంది.
యిది కాదు పద్ధతి. వీళ్ళపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి, సరైన శిక్ష పడేట్లు చేయాలి. జరిగిన నష్టపరిహారాన్ని వాళ్ళనుంచే రాబట్టాలి.
అస్మదీయులు, తస్మదీయులు గురించి ఆలోచించే మన పాలకవర్గాలకు యిదంతా పట్టదు. కాబట్టి శంకర్ సినిమాలలో లాగ ఒక ‘భారతీయుడో’, ‘అపరిచుతుడి’ రాక కోసం ఎదురుచూడకతప్పదు.
Like this:
Be the first to like this post.